హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సక్సెస్ అయి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కష్టాల కడలిలో ఉంది. తాజాగా విడుదలైన గోపీచంద్ సినిమా ‘పక్కా కమర్షియల్’ కూడా నిరాశపరచటంతో ఇప్పుడు ఇతగాడి ఆశలన్నీ రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో ‘జిల్, సీటీమార్’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినవే. బాలీవుడ్ డబ్బింగ్ రైట్స్ లేకుంటే గోపీచంద్ ని పలకరించే వారు కూడా ఉండరన్నది నగ్నసత్యం. కథల ఎంపికలో గోపీచంద్ వరుసగా తప్పటడుగులు వేస్తున్నాడని వరుసగా విడుదలైన ఆయన సినిమాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
తాజాగా తమిళ దర్శకుడు హరి తో ఓ సినిమా కమిట్ అయినట్లు వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా హరి మాస్ మసాలా డైరెక్టర్. అప్పుడెపుడో ఎన్టీఆర్ కి హరి ఓ కథను వినిపించాడని అయితే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవలేదని వినికిడి. ఇప్పుడు ఆ కథనే గోపీచంద్ కి వినిపించాడట. కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట గోపీచంద్. తాజాగా విడుదలైన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’తో పాటు హరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏనుగు’ కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న శ్రీవాస్ సినిమా హిట్ అయితేనే గోపీచంద్ కి ఊరట లభిస్తుంది. లేకుంటే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘లౌక్యం’ పుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా అలరించిన నేపథ్యంలో రాబోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి గోపీని శ్రీవాస్ గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.
