(ఏప్రిల్ 3న ప్రభుదేవ పుట్టినరోజు)
ప్రభుదేవ – ఈ పేరే చాలు నర్తకుల్లో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తుంది. ఆయన చేయి తగిలితే చాలు అనుకొనే నాట్యకళాకారులు ఎందరో ఉన్నారు. ఆయన నృత్యభంగిమలకు తకధిమితై అంటూ స్టెప్స్ వేస్తే చాలు అనుకొనేవారెందరో! ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అని తపించే నటులూ లేకపోలేదు. ఇలా ప్రభుదేవ పేరు ఎందరిలోనో పలు మెలికలు తిరిగే తలపులు రేపుతుంది.
స్ప్రింగ్ లా మెలికలు తిరగ గలడు. రబ్బర్ లా సాగిపోగలడు. పాదరసంలా జారిపోగలడు. అన్నీ కలిపి తనదైన నాట్యంతో అలరించ గలిగారు ప్రభుదేవ. అందుకే ఆయన అంటే అంతమందికి అభిమానం. అతని మెలికలు తిరిగే నృత్యం చూసి జనం ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అన్నారు. నిజం చెప్పాలంటే, అతనికంటే ఘనుడు మన ప్రభుదేవ. తన అభినయంతో నవ్వించాడు, కవ్వించాడు, కొండొకచో ఏడ్పించాడు. అన్నిటా ఆకట్టుకున్నాడు. అదీ ప్రభుదేవ బాణీగా నిలచింది. ఆపై దర్శకునిగానూ అలరించాడు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు. తన ప్రతిభను ఎన్ని విధాలుగా చాటుకున్నా, ప్రభుదేవ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డాన్సులే. కాబట్టి నర్తనమే ప్రభుదేవకు కవచం అని చెప్పవచ్చు..
ప్రముఖ నృత్యదర్శకుడు సుందరం మాస్టర్ రెండవ కొడుకు ప్రభుదేవ. 1973 ఏప్రిల్ 3న ప్రభుదేవ జన్మించారు. అన్న రాజు సుందరం, తమ్ముడు నాగేంద్ర తో కలసి బాల్యం నుంచీ డాన్సులతోనే కాలక్షేపం చేశారు ప్రభుదేవ. తండ్రికి ప్రభుదేవలోని మెలికలు తిరిగే బాణీ బాగా నచ్చింది. అందువల్ల రాజు కంటే ప్రభుదేవకే సుందరం ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వెళ్ళారు. తన తండ్రి డాన్స్ కంపోజ్ చేసే సినిమాలన్నిటా పనిచేసేవారు ప్రభుదేవ. అగ్రకథానాయకుల చిత్రాలకు వారి ఇమేజ్ ను , బాడీ లాంగ్వేజ్ ను గుర్తుంచుకొని మరీ డాన్స్ కంపోజ్ చేసేవారు ప్రభుదేవ. తరువాతి రోజుల్లో సోలోగా డాన్స్ కొరియోగ్రాఫర్ గా సాగిపోయారు. ప్రభుదేవను చూసి ఎంతోమంది స్ఫూర్తి చెందారు.
ప్రభుదేవలోని స్పార్క్ చూసి, ఆయనను తెరపై కూడా చూపించే ప్రయత్నం చేశారు దర్వకుడు ఖదీర్. తాను రూపొందించిన ‘హృదయం’ చిత్రంలో “ఏప్రిల్ మేలలో పాపల్లేరురా…” పాటను ప్రభుదేవపై చిత్రీకరించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఖదీర్ మిత్రుడు శంకర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘జెంటిల్ మేన్’లో “చుకు బుకు చుకు బుకు రైలే…” పాటలో ప్రభుదేవను నర్తింప చేసి జనాన్ని మురిపించారు. తన రెండో చిత్రం ‘కాదలన్’తో ప్రభుదేవను హీరోని చేశారు శంకర్. ఆ సినిమాతో ప్రభుదేవ ఎక్కడికో వెళ్ళిపోయారు. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాలలో బిజీగా నటిస్తూ సాగారు. ప్రభుదేవ హీరోగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. అనేక తెలుగు చిత్రాలలో ప్రభుదేవ కీలక పాత్రలు పోషించి అలరించారు.
నృత్య దర్శకత్వంలో తనదైన బాణీ పలికించే ప్రభుదేవాలో ఓ దర్శకుడు కూడా దాగున్నాడని తెలుగు నిర్మాత ఎమ్.ఎస్.రాజు పసిగట్టారు. తన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రభుదేవను దర్శకునిగా నిలిపారు రాజు. తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘పౌర్ణమి’లో తనకు ప్రాణమైన నృత్యాన్నే ప్రధానాంశంగా చొప్పించి సినిమా తెరకెక్కించారు ప్రభుదేవ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘పోకిరి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ హీరోగా ‘పోక్కిరి’ పేరుతో రీమేక్ చేశారు ప్రభుదేవ. ఆ తరువాత వరుసగా నాలుగు రీమేకులతో సాగారు ప్రభుదేవ. వాటిలో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్ ‘ ఒకటి, ఇక సరైన సక్సెస్ కోసం సల్మాన్ ఖాన్ ఎదురుచూస్తున్న సమయంలో ‘పోకిరి’ రీమేక్ గా ఆయనతో ‘వాంటెడ్’ తీశారు ప్రభుదేవ. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.
తెలుగులో రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా, ఆ సినిమా మరింత విజయం మూటకట్టుకుంది. అప్పటి నుంచీ వరుసగా హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ సాగారు ప్రభుదేవ. అయితే, ‘వాంటెడ్, రౌడీ రాథోడ్’ స్థాయి విజయాలయితే మళ్ళీ అతనికి దక్కలేదు. సల్మాన్ ఖాన్ హీరోగా ‘రాధే’ అనే చిత్రాన్ని గత సంవత్సరం రూపొందించారు ప్రభుదేవ. కొరియన్ సినిమా ‘ద ఔట్ లాస్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. దాంతో ‘పే ఫర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.33 కోట్లు మాత్రమే పోగేసింది. ‘రాధే’ పరాజయం తరువాత ప్రభుదేవ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకునిగా వెనుకంజ వేసిన ప్రభుదేవ ఓ కన్నడ చిత్రం, ఏడు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది ప్రభుదేవకు సంతృప్తి నిస్తుందో చూడాలి.
