George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా లాంచ్ రోజే డిస్ట్రిబ్యూషన్ కూడా లాక్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
‘జార్జ్ క్రిష్’కు సంబంధించిన నైజాం రైట్స్ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ హక్కులను వాసుదేవ మూవీ క్రియేషన్స్, ఈస్ట్ను వింటేజ్ క్రియేషన్స్, వెస్ట్ను ఆదిత్య ఫిలిమ్స్, కృష్ణను వ్యోమ్ సినిమాస్, గుంటూరును ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు హక్కులను అభి సినిమాస్, సీడెడ్ను శిల్పకళ సంస్థలు దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ రైట్స్ను వ్యోమ్, సినిమా పారడిసో సంస్థలు నిర్వహించనున్నాయి. శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయనకు మరోసారి మంచి కమ్బ్యాక్ అందించే మూవీగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ను సరికొత్త లుక్లో చూపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ టచ్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘జార్జ్ క్రిష్’.. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.

