Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!

Zombie Reddy2

Zombie Reddy2

Zombie Reddy 2: ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘మిరాయ్ 2’ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, మరోవైపు తన కెరీర్‌లో కీలక విజయంగా నిలిచిన ‘జోంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘జోంబీ రెడ్డి 2’పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ‘జోంబీ రెడ్డి 2’లో కథానాయిక పాత్ర కోసం బాలీవుడ్ నటి షనయా కపూర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమైతే, షనయా కపూర్ ఈ సినిమాతోనే తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈసారి కథను మాత్రమే అందించనున్నారని, సీక్వెల్‌కు మరో దర్శకుడు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. తొలి భాగం తన వినూత్నమైన జాంబీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం షనయా కపూర్ ఎంపికపై వస్తున్న వార్తలు అధికారికంగా ధృవీకరించబడలేదు. చిత్రబృందం నుంచి ప్రకటన వెలువడిన తర్వాతే హీరోయిన్ ఎంపికపై పూర్తి స్పష్టత రానుంది.