Samantha : సినీ పరిశ్రమలో విజయాలు, పరాజయాలు మామూలే. అయితే కొన్ని ఫ్లాప్లు మొత్తం జానర్పైనే ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లు బాక్సాఫీస్ను శాసిస్తున్న వేళ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన అనుష్క శెట్టి నటించిన ‘ఘాటీ’ కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరచడంతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్పై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఓ బేబీ’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఇప్పటికీ సమంత కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇటీవల పెద్ద హీరోల సినిమాలు, యాక్షన్ ఎంటర్టైనర్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకోవడం కాస్త కష్టంగా మారింది. ‘ఘాటీ’ ఫలితం కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సమంత సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ సినిమా విషయంలో నిర్మాతలకు పెద్దగా ఆందోళన అవసరం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కారణం నాన్ థియేట్రికల్ బిజినెస్. ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనే ఈ చిత్రం సుమారు రూ.30 కోట్లకు పైగా ఆదాయం సాధించినట్లు సమాచారం. దీంతో విడుదలకు ముందే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. మంచి మౌత్ టాక్ వస్తే ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ను కూడా ఈ సినిమా మార్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ‘మా ఇంటి బంగారం’ సమంతకు మరో విజయాన్ని అందిస్తుందా, లేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఉన్న సందేహాలను మరింత పెంచుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

