Thriller Movie : ఓటీటీలోకి వస్తున్న సినిమాలలో థ్రిల్లర్ జానర్ ఎక్కువగా ఆదరణ పొందుతోంది. వీటిని ప్రేక్షకులు కూడా వదలకుండా చూస్తున్నారు. ఇలాంటి జానర్ చూసేందుకు భాషను కూడా లెక్క చేయడంలేదు. రీసెంట్ గా ఒక మరాఠీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చింది. స్టోరీ కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. చీకటి పడితేనే భయంతో తలుపులు మూసేసుకునే ఒక మారుమూల గ్రామం. ఊరిలో ఒక్కోసారి ఒక్కో శవం బయటపడుతోంది. ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో.. ఆ మరణాల చుట్టూ దైవం, శాపం, ఆత్మలు, బలి వంటి కథలు అల్లుకుంటూ ఉంటాయి. ఇలాంటి భయంకరమైన వాతావరణంలోకి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ అడుగుపెడితే పరిస్థితి ఎలా మారుతుందో చూపించిన మరాఠీ డార్క్ క్రైమ్ థ్రిల్లరే ‘సల్బర్డి’ (Salbardi). థియేటర్లలో మిస్టరీ ప్రియులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఉత్కంఠలో ముంచేస్తోంది.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
2026 ఏప్రిల్ 17న విడుదలైన ఈ చిత్రానికి రమేష్ సాహెబ్రావు చౌదరి దర్శకత్వం వహించారు. ఈ మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ Amazon Prime Video లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. మే 22 నుంచి ఇది ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రముఖ నటి పూజా సావంత్ ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ మనోరమ ప్రధాన్ పాత్రలో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో స్టార్ హీరోయిన్ సొనాలీ కుల్కర్ణి ఈ చిత్రంలో మంజుల అనే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించగా, యాక్టర్ గష్మీర్ మహాజని ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశాడు. వీరితో పాటు మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు శశాంక్ షెండే, ఓంకర్ భోజనే, భరత్ గణేష్పురే లు ఇతర కీలక పాత్రలలో నటించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
ఈ మరాఠీ థ్రిల్లర్ కథ ఏమిటంటే
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులోని ‘సల్బర్డి’ అనే గ్రామం నేపథ్యంగా కథ సాగుతుంది. ఆ ఊరిలో వరుసగా జరుగుతున్న వింత మరణాలు ప్రజల్లో భయాన్ని నింపేస్తుంటాయి. స్థానికులు వాటిని దైవ ఆగ్రహంగా భావిస్తుంటే, రాజకీయ నాయకులు మాత్రం అసలు నిజాలు బయటకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో కేసు విచారణ బాధ్యతను లేడీ పోలీస్ ఆఫీసర్ మనోరమ ప్రధాన్కు అప్పగిస్తారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన మనోరమకు ఊరిలోని ఒక పాత బంగళా చుట్టూ తిరిగే రహస్యాలు అనుమానాలు కలిగిస్తాయి. బయటికి కనిపించేది మూఢనమ్మకాల కథలా ఉన్నా.. లోపల మాత్రం ఆ హత్యలకు శక్తివంతుల కుట్రలు ఉన్నాయని ఆమె గ్రహిస్తుంది. నిజం వెలికితీసే ప్రయత్నంలో ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతాయి. అయినా వెనక్కి తగ్గకుండా ఒక్కో క్లూను వెంబడిస్తూ అసలు నేరస్థుడి వరకు చేరుకునే విధానం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ క్రమంలో ఆ హత్యలు చేస్తున్నది ఎవరు ? ఎందుకు చేస్తున్నారు ? మనోరమ ఆ హంతకులను ఎలా పట్టుకుంటుంది ? అనే విషయాలతో స్టోరీ ఉత్కంఠభరతంగా సాగుతుంది.
