Saif-Kiara Movie: బాలీవుడ్లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్కు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ ఇప్పటికే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్టింగ్ చివరి దశలో ఉండగా, కనికా ధిల్లాన్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బృందం ఈ కథపై చాలా కాలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్క్రిప్ట్ దాదాపు పూర్తవడంతో ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ పాత్రలను దృష్టిలో పెట్టుకునే కథను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. సూపర్నేచురల్ ఎలిమెంట్స్ తో సాగే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. హారర్, మిస్టరీ, సైకాలజికల్ థీమ్స్ తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కనికా ధిల్లాన్ ఇప్పటికే బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ రచయిత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. స్ట్రాంగ్ లేడీ ఓరియెంటెడ్ పాత్రలు, ఊహించని మలుపులు, ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చే కథలతో ఆమె ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఆమె రచించిన ‘మన్మర్జియాన్’, ‘కేదార్నాథ్’, ‘జడ్జిమెంటల్ హై క్యా’, ‘హసీన్ దిల్రూబా’, ‘రష్మీ రాకెట్’, ‘రక్షా బంధన్’, ‘డంకీ’ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. రచయిత్రిగానే కాకుండా నిర్మాతగా కూడా కనికా తన ప్రయాణాన్ని విస్తరించారు. తన సొంత బ్యానర్ ‘కత్తా పిక్చర్స్’ ద్వారా ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టి ‘దో పట్టి’ వంటి ప్రాజెక్ట్లను ఆమె నిర్మించారు. ముఖ్యంగా ‘హసీన్ దిల్రూబా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా’ వంటి థ్రిల్లర్ సినిమాలతో ఆమె కథలను అందించడంతో ఆమెపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు దర్శకురాలిగా ఆమె తొలి ప్రయత్నం ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది.
మరోవైపు సైఫ్ అలీ ఖాన్ విభిన్నమైన పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా గుర్తింపు పొందారు. కియారా అద్వానీ కూడా గత కొన్నేళ్లుగా భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరూ తొలిసారి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండటంతో వారి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన చివరి పనులు కొనసాగుతున్నాయి. ఆఫీషియల్ టైటిల్తో పాటు ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుండటంతో, సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ కాంబినేషన్లో వస్తున్న ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ బాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్లలో ఒకటిగా మారింది. ఇక కియారా అద్వానీ నటించిన ‘టాక్సిక్’ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా, ఇప్పుడు ఆమె నటిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ మీద కూడా అంచనాలు భారీగా క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

