Rukmini Vasanth : సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డీప్ఫేక్ టెక్నాలజీతో ప్రముఖుల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు అలాంటి ఘటనలో ప్రముఖ నటి రుక్మిణి వసంత బాధితురాలగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నటి రుక్మిణి వసంతకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మార్ఫింగ్ ను ఉద్దేశపూర్వకంగా రూపొందించి ఆమె ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా షేర్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ కేసులో బాగల్కోట్ జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన జి రవికుమార్ (24), శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాకు చెందిన ఎల్ చంద్రకాంత్ (33), బెంగళూరులోని నాగసంద్ర మహాలక్ష్మి నగర్కు చెందిన ఆర్ రంజిత్ (25)లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
నిందితులు రూపొందించిన ఫోటోలు, వీడియోలు నటి వ్యక్తిగత గౌరవానికి తీవ్ర భంగం కలిగించాయని ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. అంతేకాకుండా ఆమెను ప్రజల ముందు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పాటు మానసికంగా వేధింపులకు గురిచేసే ఉద్దేశం కూడా ఇందులో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కేవలం వ్యక్తిగత ప్రతిష్టనే కాదు, డిజిటల్ ప్రపంచంలో భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో డీప్ఫేక్ వీడియోలు, ఏఐ ఆధారిత మార్ఫింగ్ కంటెంట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఇలాంటి నేరాలకు బలవుతన్నారు. దీంతో పోలీసులు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు మరోసారి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అయినా , దాన్ని ఇతరుల గౌరవాన్ని దెబ్బతీయడానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. డిజిటల్ వేదికల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. రిషబ్ శెట్టి ‘ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్-1’లో రుక్మిణి వసంత చివరిసారిగా కనిపించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విస్తృత ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

