Rishab Shetty: ‘జై హనుమాన్’ తర్వాతే శివాజీ.. ‘కాంతార 2’పైనా క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి!

Rishab Shetty (2)

Rishab Shetty (2)

Rishab Shetty: ఒకవైపు పాన్ ఇండియా హీరోగా వరుస భారీ ప్రాజెక్ట్‌లు, మరోవైపు దర్శకుడిగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలనే అరుదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు రిషబ్ శెట్టి. ఇప్పుడు మరోసారి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచే విషయాలను వెల్లడించారు. తన చేతిలో ఉన్న భారీ చిత్రాల షెడ్యూల్‌తో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాంతార’ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కూడా ఆయన తొలిసారి స్పష్టత ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు. ప్రస్తుతం ఆయన నటుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’తో పాటు, సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగదని ఆయన స్పష్టం చేశారు. రెండు పాత్రలకూ పూర్తిగా భిన్నమైన గెటప్, ప్రత్యేకమైన ప్రిపరేషన్ అవసరం కావడంతో ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాను ప్రారంభిస్తానని తెలిపారు. ముందుగా ‘జై హనుమాన్’ చిత్రాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర కోసం సిద్ధమవుతానని వెల్లడించారు. ఈ రెండు చిత్రాల్లో ప్రేక్షకులు తనను పూర్తిగా భిన్నమైన రూపాల్లో చూడబోతున్నారని కూడా ఆయన చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో ‘కాంతార’ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై కూడా రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, అదే సమయంలో ‘కాంతార: చాప్టర్ 2’ పనులు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు. తనతో పాటు ప్రత్యేక రచయితల బృందం ఇప్పటికే కథపై పని చేస్తోందని, ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు.

ఇటీవల రిషబ్ శెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టబోతున్నారనే ప్రచారం వినిపించిన నేపథ్యంలో, ఆయన ఆ ఊహాగానాలను కూడా ఖండించారు. దర్శకత్వాన్ని ఎప్పటికీ వదిలిపెట్టబోనని స్పష్టం చేస్తూ, సినిమా తెరకెక్కించే ప్రక్రియలోనే తనకు నిజమైన సంతృప్తి, మనశ్శాంతి లభిస్తాయని చెప్పారు. దర్శకత్వం తనలో విడదీయలేని భాగమని, అందుకే నటుడిగా ఎంత బిజీగా ఉన్నా దర్శకుడిగా తన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

ఇక 2022లో విడుదలైన ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుని భారతీయ చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. కర్ణాటక జానపద సంస్కృతిని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇప్పుడు ‘జై హనుమాన్’, ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’, ‘కాంతార: చాప్టర్ 2’ వంటి మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో రిషబ్ శెట్టి తన కెరీర్‌లో అత్యంత బిజీ దశలోకి అడుగుపెట్టారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో ఆయన నుంచి వరుసగా భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా, అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉండబోతన్నాయి.