NTV Telugu Site icon

నక్సలైట్ గా మారిన ఆర్జీవీ… ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో హల్చల్

RGV

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు నక్సలైట్ గా కొత్త అవతారం ఎత్తారు. ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో ఆయన హల్చల్, చేయగా దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరు వినలేదు. ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలు చూశా. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేను ముంబైలో ‘సత్య’, ‘కంపెనీ’, ఇక్కడ ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధ పోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశా. ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు.

గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండా ముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అది పట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశా. ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం… వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది. అందుకని, సినిమాకు ‘కొండా’ పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశా. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది” అని అన్నారు.

కొండా మురళి మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గురించి ఏమనుకుంటారో, కొండా మురళి గురించి కూడా ప్రజలు అదే అనుకుంటారు… ‘ఎవరి మాట వినరు’ అని! నేను మాట వినను. కానీ, జనాలకు సేవ చేస్తా. మాట తప్పను, మడమ తిప్పను. పని మాత్రం చేసి పెడతా. ఈ రోజు వరకు ఇలా బతుకుతున్నామంటే ప్రజలే కారణం. బాల్ థాకరే, అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే… పెద్ద పెద్ద హీరోలతో వర్మ పని చేశారు. ఆ స్థాయిలో కొండా మురళిని తీసుకు రావాలని ఈ సినిమా చేశారు. ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో… సినిమా కోసం వర్మ అంత తపన పడ్డారు. వర్మను మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని ప్రజల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆయన ఏ కల్మషం లేని వ్యక్తి. నా పాత్రలో అదిత్ అరుణ్ బాగా నటించారు. ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంది. నా మీద ఫైరింగ్ అయ్యే సీన్ చూస్తే… నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది చూడలేక పక్కకి వెళ్లాను. సినిమా మరో మూడు పార్ట్స్ తీయాలని కోరుతున్నాను” అని అన్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ సింహం అయితే… రాజకీయాల్లో కొండా మురళి సింహం. మురళి గారి బయోపిక్ చేయాలని చాలా రోజులుగా మా కోరిక. గుణశేఖర్ గారిని కలిసినప్పుడు నేను, మా అమ్మాయి మా మనసులో మాట చెప్పాం. ఆయన ఒక్కటే మాట అన్నారు… ‘మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవీ సారే తీయాలి. ఆయన షూటింగులో ఉండి తీయాలి. అప్పుడే క్లిక్ అవుతుంది’ అన్నారు. అప్పుడు మాకు ఆర్జీవీ అన్నను కలిసే అవకాశం రాలేదు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో వాళ్లిద్దరూ కలిశారు. ‘కొండా’ తెరకెక్కింది. ఒక తపస్సులా ఆర్జీవీ ఈ సినిమా తీశారు.

ఆయన పనులన్నీ వదిలేసి… రోజుల తరబడి వ‌రంగ‌ల్‌లో ఉండి సినిమా తీశారు. మా జీవితం రెండున్నర గంటల్లో చూపించే సినిమా కాదు. వర్మకు కథ మొత్తం తెలుసు. రెండున్నర గంటల్లో పది శాతం జీవితాన్ని తీసుకొచ్చినా సంతోషపడతానని వర్మ చెప్పారంటే… మా జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. పులి కడుపులో పులే పుడుతుంది. నా కూతురు పులి. ఏడేళ్ల నుంచి తను ఎన్నో కష్టాలు పడింది. మా కుటుంబాలు కూడా ఎన్నో బాధలు పడ్డాయి. భవిష్యత్తులో వాటిని వేరే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వర్మ చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ చూపించారు. అందులో లీనం అయ్యా. సినిమా ఎలా తీశారో చెప్పనవసరం లేదు. కొండా మురళి జీవితం చాలా మందికి తెలియదు. మేం ముళ్లబాట మీద నడిచి ఈ స్థాయికి వచ్చాం. మేం ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణం. ఈ సినిమాతో ప్రజలకు తెలుస్తుంది. వర్మ మా సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు బాగా చేశారు” అని అన్నారు.