అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప శక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లు కుటుంబం చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సినిమా రంగాన్ని ఐటీ మరియు ఫార్మా రంగాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను స్వతహాగా సినిమా అభిమానినని చెప్పుకున్న సీఎం, గతంలో వనపర్తిలో లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసిన రోజులను గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో కృష్ణ గారు ఏడాదికి 15 సినిమాలు చేసేవారు, నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ నేడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఒక్కో సినిమాకు ఐదారేళ్లు సమయం పడుతోంది” అని ప్రస్తుత నిర్మాణ శైలిని విశ్లేషించారు.
Also Read :Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
తెలుగు సినిమా మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి రావడంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన కృషిని ఆయన కొనియాడారు. కృష్ణ గారు తెలుగు సినిమాల్లో చేసిన సాహసాలు పరిశ్రమను మలుపు తిప్పాయని గుర్తు చేశారు. నేడు భాషా అడ్డంకులు తొలగిపోయాయని, కేవలం టాలెంట్ మాత్రమే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాయి. తెలుగు సినిమాకు ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ పోటీ కాదని.. మన లక్ష్యం హాలీవుడ్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశీ చిత్రాలు సైతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునే స్థాయికి మన మౌలిక సదుపాయాలు పెరగాలని ఆకాంక్షించారు. కృష్ణా నగర్ వంటి ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించి, ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
