Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రాయలసీమ అంటే ఫ్యాక్షన్, భారీ యాక్షన్ సీక్వెన్స్ , పవర్ఫుల్ డైలాగులు గుర్తుకు వచ్చేవి. ముఖ్యంగా వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ తో మొదలైన ఈ ట్రెండ్ బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’తో పీక్స్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆతరువాత వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. అయితే కాలక్రమేణా అదే కథలు, అదే తరహా పాత్రలు ఎక్కువవడంతో దర్శకులు ఈ జానర్కు కాస్త దూరమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారుతోంది. ఫ్యాక్షన్ కథల కంటే రాయలసీమ యాస, సంస్కృతి కథలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా ఇప్పటి దర్శకులు ఆలోచిస్తున్నట్లున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మా ఇంటి బంగారం’, అఖిల్ అక్కినేని నటించిన తాజా హిట్ ‘లెనిన్’ చిత్రాల్లో రాయలసీమ యాసకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రెండు సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు ఆ యాసలో మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథతో పాటు భాష కూడా పాత్రలకి హైప్ పెంచిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదే ట్రెండ్ ఇప్పుడు మరో పెద్ద చిత్రంలో కూడా కొనసాగబోతోంది. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త సినిమా కూడా రాయలసీమ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఫ్యాక్షన్ అంశాలకు కామెడీ జత చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి సినిమాలకు కామెడీనే బలం. దీంతో రాయలసీమ యాసను ఆయన తనదైన మేకింగ్ స్టైల్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఒకప్పుడు కేవలం యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన రాయలసీమ నేపథ్యం ఇప్పుడు విభిన్న జానర్లకు కూడా విస్తరిస్తోంది. ప్రేక్షకులు కూడా ప్రాంతీయ భాషలు, స్థానిక సంస్కృతిని సహజంగా చూపించే కథలకు మంచి ఆదరణ ఇవ్వడంతో దర్శకులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి రాయలసీమ యాస మరోసారి టాలీవుడ్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. యాక్షన్ కథల్లోనే కాదు, కుటుంబ కథలు, కామెడీ చిత్రాలతో ఈ యాసకు మరింత స్థానం దక్కుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద చిత్రాలు కూడా ఈ నేపథ్యాన్ని ఎంచుకుంటాయా? రాయలసీమ యాస మరోసారి టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్గా మారుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

