Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!

Ranabaali 300kb

Ranabaali 300kb

Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసారి ఇద్దరూ లవ్ స్టోరీలో కాకుండా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచే అప్‌డేట్ వచ్చింది.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిగా ముగించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం రష్మికకు సెట్స్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కూడా ఆమెతో కలిసి ఉన్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మికకు విజయ్ ఇచ్చిన స్పెషల్ హగ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక సినిమాలో రష్మిక పాత్రకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు సినిమాపై మరింత బజ్ పెంచుతున్నాయి. ‘జయమ్మ’గా రష్మిక కొన్ని సన్నివేశాల్లో గర్భిణిగా కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దీంతో కథలో జయమ్మ పాత్రకు గురించి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతోంది.

ఇటీవలే ‘రణబాలి’ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఓ రగ్గడ్ వారియర్‌గా కనిపిస్తున్నాడు. చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని నేపథ్యంగా తీసుకుని రాహుల్ సంకృత్యాన్ ఈ కథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌తోనే స్పష్టమైంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

మరోవైపు ఈ సినిమాకు రిలీజ్ విషయంలో కూడా కీలక మార్పు జరిగింది. తొలుత సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రావాల్సిన ‘రణబాలి’ ఇప్పుడు 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక హిప్ ఇంజ్యూరీ కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు రావడంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఆమె షూటింగ్ పూర్తి కావడంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

‘రణబాలి’ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ సిరీస్ సమర్పిస్తోంది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ గతంలో ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో తనదైన మేకింగ్ చూపించగా, ఇప్పుడు ‘రణబాలి’ని మరింత భారీ కాన్వాస్‌పై తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని నిజమైన లొకేషన్లలో కూడా షూటింగ్ జరిపినట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు.  మరి అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రణబాలి’ విజయ్, రష్మికలకు మరో భారీ హిట్‌ను అందిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.