మన దగ్గర ఒకప్పుడు సినిమాలు విడుదలకు ముందు ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే కొనసాగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కి మాత్రం ఈ సారి కొంచెం విభిన్నంగా, ఇంకా గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు. “కూలీ అన్లీష్డ్” పేరుతో జరిగిన ఈ ఈవెంట్ యూట్యూబ్ లేదా ఇతర ఛానెల్స్లో లైవ్ ఇవ్వకుండా, సన్ టీవీ లో ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేశారు.
Also Read : Anupama : బ్రిడ్జ్పై నుండి కిందపడిపోయిన అనుపమ – షూటింగ్లో ఏం జరిగిందంటే ?
ఈ ఈవెంట్లో మరో విశేషం ఏమిటంటే.. కూలీ ఈవెంట్ తెలుగులో కూడా ప్రసారం కానుంది. ఆగస్టు 15న రాత్రి 9:30 గంటలకు సన్ నెట్వర్క్లో భాగమైన జెమినీ టీవీపై ఇది ప్రసారం కానుంది. సాధారణంగా తమిళ సినిమాలకు తెలుగులో చిన్న ఈవెంట్లు లేదా ప్రెస్ మీట్లు చేస్తారు. కానీ చెన్నైలో జరిగిన ఒక పూర్తి స్థాయి తమిళ ఈవెంట్ను నేరుగా తెలుగులో ప్రసారం చేయడం చాలా అరుదు. బహుశా ఇది తొలిసారి అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ ఈవెంట్లో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పాడిన పాటల బదులు కూలీ తెలుగు పాటలను వినిపించనున్నారు. అలాగే..
స్పీచ్లకు కూడా తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇది తమిళ సినిమాలను డబ్ చేయడం దాటికి, ఈవెంట్లను కూడా అనువదిస్తున్నారా అన్న చర్చలకు దారితీసింది. ఈ నిర్ణయం ‘కూలీ’ తెలుగు ప్రమోషన్లలో టీం పెట్టుకున్న శ్రద్ధకు నిదర్శనం. అయితే, రజినీకాంత్ను హైదరాబాద్కు రప్పించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఉంటే మరింత బాగుండేదని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, కూలీ సినిమాకు ఇప్పటికే బంపర్ హైప్ వచ్చింది. రజినీ సినిమాలకు తెలుగులో క్రేజ్ మామూలే, దానికి తోడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం, నాగ్ విలన్ పాత్ర, ఉపేంద్ర ప్రత్యేక పాత్ర.. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆగస్టు 14న ఈ సినిమా వార్-2తో పాటు ప్రేక్షకుల ముందుకు రానుంది.
