అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ. వి. ఆర్. స్వామి నిర్మాత. ఆగస్ట్ 28న ఈ సినిమా ట్రైలర్ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” ‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో పెళ్లి వాతావరణం కనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైలర్, సాంగ్స్తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
డైరెక్టర్ అపర్ణ మల్లాది మాట్లాడుతూ ”విజయేంద్ర ప్రసాద్గారు నాకు మెంటర్, గురు, ఫ్రెండ్! ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఇదో రొమాంటిక్ కామెడీ, అడ్వెంచర్ జోనర్ మూవీ. ఫిమేల్ ప్రొటాగనిస్ట్ సినిమా. అనీషా దామా ఇందులో మెయిన్ పాత్ర చేశారు. ‘మహర్షి, ఓ బేబి, గీత గోవిందం’ చిత్రాల్లో ఈమె నటించారు. ఆమెకు జోడీగా ప్రిన్స్ యాక్ట్ చేశారు. ఇందులో అన్నపూర్ణమ్మ చాలా కీలక పాత్రను పోషించారు. ఈ మూవీ ద్వారా భావన వజపండల్ అనే మరో హీరోయిన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పవన్ సురేశ్ ఈ చిత్రంలో కామెడీ విలన్గా కనిపిస్తారు. ఇందులో నటించిన వారందరూ తెలుగు అమ్మాయిలే. మా సినిమాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రిన్స్, సాయికేతన్, అర్జున్ కళ్యాణ్కు థాంక్స్. ‘కేరాఫ్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన స్వీకర్ అగస్తి ఈ సినిమా సంగీతాన్ని సమకూర్చారు. నరేన్ ఎలాన్ ఈ సినిమాకు విజువల్స్ అందించారు” అని చెప్పారు.
అనీషా దామ మాట్లాడుతూ, ”ఏడాది ముందు ఈ ‘పెళ్లికూతురు పార్టీ’ జర్నీని స్టార్ట్ చేశాం. నాపై నమ్మకంతో నాకు మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి థాంక్స్” అని అన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో జనం ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాత ఎ.వి.ఆర్. స్వామి తెలిపారు.
