NTV Telugu Site icon

Horror: అప్పుడు ‘రాజుగారి గది’… ఇప్పుడు ‘రాణిగారి గది…’!

Rani

Rani

Roshan: ‘రాజుగారి గది’ సీరిస్ తో తెలుగులో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రముఖ యాంకర్ ఓంకార్ ఈ చిత్రాలను హారర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఇప్పుడు అదే బాటలో ‘రాణిగారి గదిలో దెయ్యం’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. రోషన్‌, సాక్షి, స్రవంతి, పూజా డే ఇందులో కీలక పాత్రలను పోషించారు. అబిద్‌ దర్శకత్వంలో మౌంట్‌ ఎవరెస్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై పి. వి. సత్యనారాయణ దీన్ని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ఆర్‌.కె. గౌడ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ “హారర్‌ కంటెంట్‌ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్‌ కావాలి’’ అని అన్నారు. నిర్మాత పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ “మా బ్యానర్‌ నుండి వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్‌ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు అబిద్ మాట్లాడుతూ “నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్‌ కథతో చక్కని సినిమా తీశాం. షేర్‌ చక్కని సంగీతం అందించారు. ఈ జర్నీలో చాలామంది నాకు సహకరించారు” అని చెప్పారు. సిరాజ్‌ మాట్లాడుతూ “తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. నా మొదటి సినిమా నుంచి ప్రసన్నకుమార్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. మంచి కథతో ఈ సినిమా చేశాం. చక్కని పాటలు కుదిరాయి” అని తెలిపారు. ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం పట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేసి, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.