నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అసలు థియేట్రికల్ ట్రైలర్ ఉండదని మేకర్స్ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలు, రూమర్లకు చెక్ పెట్టేందుకు హీరో నాని స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పలు ఆసక్తికర విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
పెద్ద సినిమా వస్తోందంటే చాలు.. రిలీజ్కు ముందు ట్రైలర్తో బజ్ క్రియేట్ చేయడం టాలీవుడ్లో ఆనవాయితీ. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం ఆ రూల్ను పక్కన పెట్టేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని నాని వివరిస్తూ.. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను గ్రాంటెడ్గా తీసుకోవడం కాదన్నారు. సినిమాపై ఉన్న హైప్ను చూసి గర్వంతో తీసుకున్న నిర్ణయం అంతకన్నా కాద స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఔట్పుట్ నాణ్యత విషయంలో టెక్నికల్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సహా టీమ్ అంతా ప్రైమరీ వర్క్స్లో బిజీగా ఉన్నారని, కేవలం ఒక ట్రైలర్ కట్ కోసం నాలుగైదు రోజులు కేటాయిస్తే మెయిన్ వర్క్ డిస్టర్బ్ అవుతుందని తెలిపారు. సినిమా కంటే ట్రైలర్ ముఖ్యం కాదనే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు పుట్టుకొచ్చాయి. సినిమాలో వేయి మందితో ఫైట్ అని, అండర్ వాటర్ ఎపిసోడ్స్ ఉంటాయని, డైరెక్టర్ ఎవరినో కొట్టారంటూ ప్రచారం జరగడంపై నాని అసహనం వ్యక్తం చేశారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని, సినిమాలో అలాంటి భారీ ఎపిసోడ్స్ ఏవీ లేవని స్పష్టం చేశారు. ఇదొక స్వచ్ఛమైన జెన్యూన్ కథ అని, హై ఇంటెన్సిటీ యాక్షన్ బ్లాక్స్తో పాటు మంచి ఎమోషన్స్ ఉంటాయని నాని భరోసా ఇచ్చారు. సినిమా చూశాక ఆడియన్స్ అంతా కచ్చితంగా కన్విన్స్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

