2021 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ‘మానాడు’ ఒకటి. దర్శకుడు వెంకట్ ప్రభు శింబుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ కామట్చి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ని ప్రవీణ్ కెఎల్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్, మొదటి సింగిల్ విడుదలై మంచి ఆదరణ పొందాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నిర్మాత సురేష్ కామట్చి ఇప్పటికే ట్విట్టర్లో ప్రకటించారు.
Read Also : భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు
ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 2న ఉదయం 11.25 గంటలకు విడుదల కానుంది. అయితే ‘మానాడు’కు నాలుగు భాషల నుంచి నలుగురు సెలెబ్రిటీలు సపోర్ట్ ను అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ ట్రైలర్ను ఎ. ఆర్. మురుగదాస్, మలయాళ ట్రైలర్ నివిన్ పాలి, తెలుగు ట్రైలర్ నాని, కన్నడ ట్రైలర్ ను రక్షిత్ శెట్టి రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ కోసం డబ్బింగ్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి.