Tollywood: “మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం.. టాలీవుడ్‌పై ‘మా రాముడు అందరివాడు’ టీమ్ ఫైర్!

Maa Andari Vadu

Maa Andari Vadu

టాలీవుడ్‌లో చిన్న సినిమాల కష్టాలు, వారి పట్ల ఇండస్ట్రీ పెద్దల వ్యవహారశైలిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ ‘మా రాముడు అందరివాడు’ చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీరామ్, నిర్మాత అనుముల లక్ష్మణరావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న తెలుగు వారిని తొక్కేస్తున్నారంటూ హీరో శ్రీరామ్ వేదికపై కుండబద్దలు కొట్టారు. “చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. కానీ, విచిత్రం ఏంటంటే తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే కదా ప్రూవ్ చేసుకోగలం? ఈ సినిమాలో చాలా దమ్ముంది, వంద సినిమాలు చేయాలన్నదే నా టార్గెట్” అంటూ తన ఆవేదనతో పాటు కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు సైతం ఇండస్ట్రీ పెద్దల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “మా సినిమాకు సపోర్ట్ చేయాలని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలను అడిగాం. కానీ ఎవరూ కనీసం పట్టించుకోలేదు. తీరా ట్రైలర్ చూశాక మాత్రం వారే బాగుందని మెచ్చుకున్నారు” అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన క్లాష్ ఉండబోతోందని మేకర్స్ రివీల్ చేశారు. సీనియర్ నటులు సుమన్ ఇందులో ముఖ్యమంత్రిగా, మంచి మెసేజ్ ఇచ్చే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్ర నిర్మాత లక్ష్మణరావు స్వయంగా మెయిన్ విలన్‌గా నటించడం. 20 ఏళ్లుగా ఓ ఊరిని అరాచకంగా తన గుప్పిట్లో పెట్టుకున్న ఎమ్మెల్యేగా లక్ష్మణరావు, సీఎం సుమన్ మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. సుమన్ మాట్లాడుతూ.. గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని, శ్రీరామ్ తన డ్యూయెల్ రోల్‌లో అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు.