‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్గా వస్తున్న ‘కేరళ స్టోరీ 2’ విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది, రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాపై కోర్టు స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సెన్సార్ బోర్డు వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమాలోని అభ్యంతరకర అంశాలను సరిగా పరిశీలించకుండానే సెన్సార్ బోర్డు అనుమతులు ఎలా ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బోర్డు పనితీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సినిమాను క్షుణ్ణంగా చూడకుండానే ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ధర్మాసనం అభిప్రాయపడింది. చిత్రంలో సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా, అత్యంత వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
Also Read: Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ
ఈ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను సెన్సార్ బోర్డు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది. సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు, ఫిర్యాదుదారుల అభ్యంతరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. ఆ వివాదాస్పద అంశాలపై స్పష్టత వచ్చే వరకు సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనివల్ల రేపు గ్రాండ్గా విడుదల కావాల్సిన ‘కేరళ స్టోరీ 2’ రిలీజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజంపై ప్రభావం చూపే సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిత్రం, తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సెన్సార్ బోర్డు ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఆ ఫిర్యాదులను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అప్పటి వరకు సినిమా రిలీజ్ నిలిచిపోయినట్టేనని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
