Radha Krishna: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాధాకృష్ణుల ప్రేమకథ నేపథ్యంలో ఒక భారీ మైథలాజికల్ డివైన్ ఎపిక్ ను నిర్మించబోతున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ఈరోజు ఆఫీషియల్ ప్రకటించారు. ఈ మూవీకి ‘రాధాకృష్ణ’ (Radha Krishna) అనే పేరును కూడా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సచిన్ రవి ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలతో నిర్మించిన కరణ్ జోహార్, ధర్మా ప్రొడక్షన్స్ ఒక పురాణ కథాంశాన్ని ఇంతటి భారీ కాన్వాస్పై దృశ్యకావ్యంగా తీసుకురాబోతుండటం విశేషం.
ఇందులో భగవాన్ శ్రీకృష్ణుడి జననం నుండి కంస వధ వరకు సాగే ఆయన ప్రయాణాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇందులో ప్రేమకథే హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, హృదయాన్ని హత్తుకునే సంగీతంతో విజువల్ వండర్గా దీనిని తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఇందులోని ప్రధాన నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మొత్తంగా చూస్తే రాధాకృష్ణుల దివ్య ప్రేమకథను కృష్ణుడి జననం నుంచి కంస సంహారం వరకు సాగిన ప్రయాణంతో ముడిపెట్టి ఒక భారీ సినిమాటిక్ అనుభూతిగా అందించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ లాంటి నిర్మాత, ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడు సచిన్ రవి కలయికలో ఈ ప్రాజెక్ట్ రావడం మాత్రం ఇప్పటికే బజ్ పేరుగుతుండగా, ఇందులో రాధ, కృష్ణ పాత్రల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ వివరాలు తెలిశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.

