Kajal Aggarwal: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథలో బాలీవుడ్, టాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన కాజల్, తన పాత్రతో పాటు యష్తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘రామాయణం’ తొలి భాగం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అయితే ఈ చిత్రంలో లంక ఎపిసోడ్కు సంబంధించిన భాగం పరిమితంగా ఉండటంతో, మండోదరిగా తన స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇలాంటి మహత్తరమైన ప్రాజెక్ట్లో భాగమవడం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
తన పాత్ర చిన్నదైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం ఉన్న చిత్రంలో నటించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని కాజల్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, ఇతిహాసాలకు ఎంతో దగ్గరైన కథలో భాగమవడం తన కెరీర్లో చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన చిత్రబృందానికి తాను ఎప్పటికీ కృతజ్ఞురాలినేనని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా యష్ గురించి కూడా కాజల్ ప్రశంసలు కురిపించారు. రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ అత్యంత అంకితభావం కలిగిన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని చెప్పారు. తన నటనతో ఎప్పుడూ ఆకట్టుకునే యష్, సెట్స్లో కూడా పూర్తిగా పాత్రలో లీనమై పనిచేస్తారని వెల్లడించారు. ఆయన ప్రొఫెషనలిజం, ప్రతిభ మొత్తం చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని కాజల్ వ్యాఖ్యానించారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ‘రామాయణం’ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకోగా, రెండో భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా విజువల్ స్పెక్టకిల్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి గ్లింప్స్, పోస్టర్లకు కూడా మంచి స్పందన వస్తోంది. ఇక రామాయణ ట్రైలర్ ను లాస్ ఏంజెల్స్లో విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. జులై 14న భారీ ఈవెంట్ తో ట్రైలర్ లాంచ్ చేసి, అప్పుడే అఫీషియల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

