Jyothika: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సుదీర్ఘ సందేశంలో జ్యోతిక, ‘జై హింద్’ అంటూ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసం తాను గళం విప్పుతున్నానని పేర్కొంటూ, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ‘ధర్మేంద్ర ప్రధాన్… మీ పదవి నుంచి తప్పుకోండి, పారదర్శకమైన ప్రజాస్వామ్య భారతదేశం కోసం నేను విద్యార్థుల పక్షాన నిలుస్తున్నాను అంటూ ఆమె తన డిమాండ్ను స్పష్టంగా వినిపించారు.
అంతేకాకుండా 20 రోజులకుపైగా నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, అలాగే ఉద్యమంలో పాల్గొంటున్న అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్లకు జ్యోతిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలపై ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నానని ఆమె ఎమోషనల్ గా స్పందించారు. యువత భయపడకుండా ఏకమై పోరాడుతున్న తీరును జ్యోతిక ప్రశంసించారు. విద్యార్థుల్లోని భయాన్ని తొలగించి, ధైర్యంగా ముందుకు వచ్చేలా చేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’కి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ వివాదంపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, సోనాక్షి సిన్హా, ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, స్వర భాస్కర్ తదితరులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
జూలై 20న పార్లమెంట్ వైపు సాగిన విద్యార్థుల మార్చ్ సందర్భంగా జరిగిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని, విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

