పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి. రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి. ఎస్. రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం కో- ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ, “దసరా నవరాత్రుల సందర్బంగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే కథ. ముఖ్యంగా తండ్రి, కొడుకు నేపథ్యంలో సాగుతుంది. ‘ఇక్షు’ చిత్రానికి అద్భుతంగా దర్శకత్వం వహించిన రుషిక గారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తరువాత ప్రారంభిస్తాం” అని అన్నారు.
దర్శకురాలు వి.వి. రుషిక మాట్లాడుతూ, ”ఈ రోజు నా రెండో సినిమా మొదలవ్వడం సంతోషంగా ఉంది. తెలుగులో మహిళా దర్శకులు చాలా తక్కువ. అందులో నేను తీసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాకు ఛాన్స్ రావడం ఆనందంగా అనిపిస్తోంది. ఈ వారంలో నటీనటులను ఎంపిక చేస్తాం. అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న రామాగ్నివేశ్ చాలా మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ కథ గురించి చెప్పాలంటే పేరెంట్స్, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో ఉంటుంది. ఈ సినిమా చూస్తే చాలా మందికి కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అంతలా ఎమోషన్స్ ఉండే సినిమా ఇది” అని తెలిపారు.