పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న రిలీజ్ అయి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అందరికీ ఓజీ యూనిట్ తరుపున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. సుజీత్ చాలా బాగా తీసాడు. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు’ అని అన్నారు.
