Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!

Hrithik Roshan Divorce (2)

Hrithik Roshan Divorce (2)

Hrithik Roshan Divorce: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఇంటీరియర్ డిజైనర్ సుసాన్ ఖాన్ విడాకులు తీసుకుని దాదాపు దశాబ్దం గడిచిపోయింది. అయితే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని పుకార్లు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విడాకుల సమయంలో సుసాన్ ఖాన్ హృతిక్ రోషన్ నుంచి 400 కోట్ల భరణం తీసుకున్నారనే ప్రచారం ఎన్నో ఏళ్లుగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై సుసాన్ ఖాన్ సోదరి ఫరా అలీ ఖాన్ స్పందిస్తూ, ఈ ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకుల అనంతరం సుసాన్ ఖాన్ హృతిక్ రోషన్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని ఫరా అలీ ఖాన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 400 కోట్ల భరణం వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా నిరాధారమైన ప్రచారమని ఆమె తేల్చిచెప్పారు. వాస్తవాలకు దూరంగా ఉన్న ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ తమ వైవాహిక జీవితానికి 2014లో ముగింపు పలికారు. అయితే విడాకుల తర్వాత కూడా వారిద్దరూ తమ ఇద్దరు కుమారుల పెంపకంలో కలిసి బాధ్యతలు పంచుకుంటున్నారు. సుసాన్ ఖాన్ వ్యక్తిత్వం గురించి కూడా ఫరా అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు కంటే బంధాలకు, మనుషుల మధ్య ఉన్న అనుబంధానికే సుసాన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆమె పేర్కొన్నారు. అందుకే ఆధారాలు లేని వార్తలను నిజమని నమ్మకుండా, వాస్తవాలను తెలుసుకుని స్పందించాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉండగా, సుసాన్ ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ హృతిక్, సుసాన్ మధ్య పరస్పర గౌరవం ఏమాత్రం తగ్గలేదని, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి ముందుకు సాగుతున్నారని అభిమానులు తరచూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ఫరా అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నాళ్లుగానో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 400 కోట్ల భరణం ప్రచారానికి మరోసారి గట్టి సమాధానం లభించినట్టైంది.