తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అయితే, ఇటీవల కాలంలో కొందరు సెలబ్రిటీలు చేసే పనులు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ చేసిన ఒక రీల్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. శ్రీవారిని దర్శనం కోసం తిరుమల వెళ్ళిన గీతు రాయల్, తన నలుగురు మగ స్నేహితులతో కలిసి ఆలయం ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు సోషల్ మీడియా రీల్ చిత్రీకరించారు. అలానే ఘాట్ రోడ్డులో కూడా కారు ఆపి రీల్ చేశారు. భక్తిభావంతో ఉండాల్సిన క్షేత్రంలో, ఇలాంటి సినిమా పాటలకు స్టెప్పులు వేయడంపై సామాన్య భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి ప్రవర్తన ఏంటని సోషల్ మీడియా వేదికగా ఆమెను నెటిజన్లు నిలదీశారు.
Also Read:Supritha: నా పెళ్లి కన్నా ముందు మా అమ్మకి పెళ్ళి చేస్తా
ఒకవైపు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడం టీటీడీకి పెద్ద సవాల్గా మారుతుంటే, మరోవైపు సెలబ్రిటీల ఇలాంటి వెర్రి చేష్టలు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ వివాదం ముదరడంతో గీతు రాయల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోలను తొలగించారు. అయినప్పటికీ, ఈ విషయంపై టీటీడీ చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె మరోసారి స్పందించారు. విమర్శలు, చర్యల హెచ్చరికలపై గీతు రాయల్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ అందులో తన ఆవేదనను, అసహనాన్ని వ్యక్తం చేశారు. “అందరికీ ఒక గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారంట, ఇక హ్యాపీగా ఉండండి. ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను, పోగొట్టుకోవడానికి ఇక ఏమీ మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరే తీసేసి సంతోషంగా ఉండండి.” అంటూ చెప్పుకొచ్చింది.
