ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులకు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై, ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో ఇదే మా కథ చిత్రం తెరకెక్కింది. ఈ రోడ్ జర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్లా దీన్ని నిర్మించారు. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్ను ఇటీవల విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు. ఆ టీజర్కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోందని, సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న తమ సినిమాను గాంధీ జయంతి అక్టోబర్ 2న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.