ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంగుబాటుకు గురవుతున్న వారికి దారిచూపేలా, ఆధ్యాత్మికతను – మానవ సంబంధాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న మూవీ “ఏదైనా సాధ్యమే”. ‘దైవం తోడుంటే..’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై అనిల్ మునగనూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మద్దూరి రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖులు, చిత్ర బృందం సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని కష్టాల నుంచి, దుఃఖాల నుంచి ఎలా విముక్తి పొందవచ్చనే ఆసక్తికరమైన పాయింట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం “శ్రీ అమ్మ భగవాన్” ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా తెరకెక్కుతుండటం విశేషం. సినిమా కథనం ప్రధానంగా కింది ఐదు సూత్రాల చుట్టూ తిరుగుతుందని మేకర్స్ తెలిపారు. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నీ ఆంతరంగిక ప్రపంచమే బాహ్య ప్రపంచం, వ్యక్తి లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉంటాయి, అంతర్గత సత్యము, జీవితమంటేనే బాంధవ్యాలు. ఈ చిత్రానికి కథ, మాటలు, సాహిత్యం అందించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ మునగనూరి మాట్లాడుతూ.. “దేశ భవిష్యత్తుకు యువత ఎంతో ముఖ్యం. కానీ, నేటి సమాజంలో చాలా మంది యువకులు నిరాశ, డిప్రెషన్ల బారిన పడి కూరుకుపోతున్నారు. ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడితో బలమైన బంధం ఏర్పడితే.. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, అసాధ్యాలు సుసాధ్యాలుగా ఎలా మారుతాయో ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇష్టదైవంతో అనుసంధానమైతే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి” అని వివరించారు.
