Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ

Vinayakan (2)

Vinayakan (2)

Double Occupancy OTT: సైన్స్ ఫిక్షన్ తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం ‘డబుల్ ఆక్యుపెన్సీ’. థియేటర్లలో యూత్ ని అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే వ్యక్తి 12 గంటలకు ఒకసారి అబ్బాయిగా, మరో సారి అమ్మాయిగా మారిపోయే ఈ చిత్రం ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు ఈ సినిమా కథ ఏమిటి? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా పెరుగుతోంది. సంతోష్, రేష్మా వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్రం 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. అశ్విన్ కందస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 10 నుంచి  అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా కథ చాలా విభిన్నమైన కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. పెళ్లైన 15 ఏళ్ల తర్వాత ఒక దంపతులకు బిడ్డ పుడుతుంది. అయితే పుట్టిన కొద్ది సేపటికే ఆ శిశువు మరణిస్తుంది. కానీ ఒక అద్భుతం వల్ల ఆ బిడ్డ మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. అయితే ప్రతి 12 గంటలకు ఒకసారి ఆ బిడ్డ జెండర్ మారిపోతూ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయిగా, సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అబ్బాయిగా జీవిస్తుంది. ఈ రెండు వ్యక్తిత్వాలకు సరిపోయేలా కుటుంబ సభ్యులు ఆ బిడ్డకు ‘రజినీ’ అనే పేరు పెడతారు.

కాలక్రమంలో రజినీ పెద్దవాడిగా ఎదుగుతాడు. శరీరం ఒక్కటే అయినప్పటికీ, ఈ రెండు వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నమైన జీవితాలను గడుపుతాయి. ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో, నోట్స్, సందేశాలు, చిన్న చిన్న ఆధారాల ద్వారానే తమ మధ్య సమాచారాన్ని పంచుకుంటూ జీవిస్తుంటారు. ఇక ఈ కథ మరింత వినోదాత్మకంగా మారేది ప్రేమ దగ్గరే. పగటి సమయంలో ఒక ప్రేమకథ, రాత్రి సమయంలో మరో ప్రేమకథ కొనసాగుతుండటంతో అనేక గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు ఈ అసాధారణ పరిస్థితికి ఎలాంటి ముగింపు లభిస్తుంది? అనే ప్రశ్నల చుట్టూనే సినిమా సాగుతుంది.

ఈ చిత్రంలో సంతోష్, రేష్మా వెంకటేష్ ఇద్దరూ రజినీ పాత్రను పోషించడం విశేషం. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో గుర్తింపు పొందిన సంతోష్‌కు ఇది హీరోగా తొలి చిత్రం. వీరితో పాటు సంయుక్త విశ్వనాథన్, వినోద్ కిషన్, వీటీవీ గణేష్, భగవతి పెరుమాళ్, వినోదిని వైద్యనాథన్, ఖుష్బూ సుందర్, విచ్చు విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అశ్విన్ కందస్వామి కథను రచించి దర్శకత్వం వహించగా, అవ్ని మూవీస్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, ఆనందిత సుందర్, ఏసీ షణ్ముగం, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. వినూత్నమైన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఒక భిన్నమైన ఓటీటీ అనుభూతిని అందించే చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.