టాలీవుడ్ సీనియర్ దర్శకుడు మెహర్ రమేష్ త్వరలోనే వెండితెరపై నటుడిగా కనిపించబోతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించి నటుడిగా మెప్పించిన మెహర్ రమేష్, ఆ తర్వాత మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ప్రభాస్ హీరోగా బిల్లా, ఎన్టీఆర్ హీరోగా కంత్రి, శక్తి, వెంకీతో షాడో, చిరుతో భోళా శంకర్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు మెహర్. కానీ బిల్లా మినహా మిగిలిన సినిమాలన్నీ ప్లాప్స్ కావడంతో డైరెక్టర్ గా కాస్త గ్యాప్ వచ్చింది.
దాంతో ఇప్పడు యాక్టింగ్ వైపు మళ్లాడు మెహర్ రమేష్. చాలా కాలం తర్వాత మళ్లీ మేకప్ వేసుకోనుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్, రాబోయే ఒక క్రేజీ ప్రాజెక్ట్లో నటుడిగా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. కథ డిమాండ్ మేరకు ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘బాబీ’ సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై పూర్తిస్థాయి పాత్రలో కనిపించకపోవడంతో, ఈ రీ-ఎంట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సాధారణంగా దర్శకులు నటులుగా మారి మెప్పించడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. గతంలో విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దిగ్గజాల నుంచి నేటి తరం దర్శకుల వరకు చాలా మంది నటులుగా మారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో మెహర్ రమేష్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు, సినిమా పేరు మరియు ఆయన పాత్ర గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

