Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్ తెలిపారు. అనంతరం దర్శన్ పిలవడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పవిత్ర గౌడ కూడా రేణుకాస్వామిని చెప్పుతో కొట్టినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
అనంతరం రేణుకాస్వామిని అండర్వేర్తోనే టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాడుతో దాడి చేసినట్లు ప్రదోష్ వెల్లడించారు. అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత దర్శన్.. రేణుకాస్వామి ఛాతీ, మెడపై కాలితో బలంగా తన్నాడని, దీంతో అతడు స్పృహ కోల్పోయాడని పేర్కొన్నారు. ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించాడని, తాను అతడిని పక్కకు లాగిన సమయంలో రేణుకాస్వామి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించానని ప్రదోష్ వాంగ్మూలంలో చెప్పారు. హత్య విషయం బయటకు రాకుండా సెటిల్ చేయాలని దర్శన్ ఒత్తిడి చేసినట్లు కూడా ప్రదోష్ వెల్లడించారు. విషయం సెటిల్ చేయకపోతే తుపాకీతో కాల్చుకుని చనిపోతానని దర్శన్ బెదిరించినట్లు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో హత్య విషయం బయటకు రాకుండా ప్రయత్నించామని ప్రదోష్ తెలిపారు. ఇప్పటికే కేసులో కీలక వివరాలు వెల్లడించిన ప్రదోష్.. తనను దర్శన్తో కలిసి కాకుండా ప్రత్యేక సెల్లో ఉంచాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

