తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బ్లాస్ట్ అయింది. గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి మరో వర్గంగా ఎవరికీ వారు విమర్శలు చేసుకున్నారు.
నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదం పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు మరియు ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ గళాన్ని వినిపించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, స్రవంతి రవి కిషోర్, సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రవి, చెర్రీ మరియు యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. సినీ ఎగ్జిబిటర్ల తరపున ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరై థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీ ప్రభావం, టికెట్ ధరలు మరియు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
