Viswanath & Sons: ‘అల వైకుంఠపురములో’ రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్!

Viswanath And Sons (4)

Viswanath And Sons (4)

Viswanath & Sons: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ, సూర్య అభిమానులకు ప్రత్యేక హామీ ఇచ్చారు. ‘గజినీ’ సినిమాలో ప్రేక్షకులు ఎంతగానో అభిమానించిన సంజయ్ రామస్వామి తరహా సూర్యను మరోసారి ఈ చిత్రంలో చూడబోతున్నారని అన్నారు. అంతేకాదు, తెలుగులో తమ నిర్మాణ సంస్థ రూపొందించిన ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి ఘన విజయం సాధించిందో, తమిళంలో ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే స్థాయి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ పోలికను తాము నిర్మించిన చిత్రంతోనే చేస్తున్నానని కూడా స్పష్టం చేశారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాత్రం ఎంతో హుందాగా స్పందించారు. పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం తనకు ఇష్టం లేదని చెబుతూ, రెండున్నర గంటల నిడివి గల సినిమాలో కనీసం గంటా నలభై ఐదు నిమిషాల పాటు ప్రేక్షకులను పూర్తిగా అలరిస్తామని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సభలో భారీగా చప్పట్లు వినిపించాయి. ముఖ్యంగా తమిళంలో ఆయన చేసిన ప్రసంగం అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. హీరో సూర్య కూడా దర్శకుడు వెంకీ అట్లూరిపై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు తనతో సినిమా చేయాలని వెంకీ కోరిక వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్న సూర్య, తర్వాత ‘లక్కీ భాస్కర్’ చూసిన అనంతరం తానే వెంకీతో పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ తీరు బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. ఒకరిపై ఒకరు నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో మంచి బజ్ సొంతం చేసుకుంది ‘విశ్వనాథ్ & సన్స్’. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.