Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్బస్టర్స్గా నిలిచాయి.
అయితే ఎంఎం కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన రణ కుంభ, సంచారి పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయా?.. లేదా ఆ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్కు కీరవాణి సంగీతం తోడైతే.. తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో అభిమానులు ఇప్పటికే చూశారు. ఇక వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్కు వస్తున్న స్పందన చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా. మహేష్–రాజమౌళి కాంబినేషన్కు కీరవాణి సంగీతం తోడవడంతో వారణాసి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం వారణాసి ఆల్బమ్ గురించి నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

