Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, అపోలో సంస్థల బాధ్యతలు చూసుకునే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఉపాసన కొణిదెల ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బయట ప్రపంచానికి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమె కూడా గతంలో తీవ్రమైన బాడీ షేమింగ్కు గురయ్యారన్న చేదు నిజాన్ని తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా రామ్ చరణ్తో వివాహం జరిగిన కొత్తలో ఎదురైన దారుణమైన కామెంట్లు తనను ఎంతగా బాధించాయో వివరిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్తో మ్యారేజ్ అయిన టైంలో ఎదురైన చేదు అనుభవాలను ఉపాసన గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రామ్ చరణ్కు ఆమె తగిన జోడీ కాదు.. ఎంతో లావుగా ఉంది’ అంటూ కొందరు బహిరంగంగానే తీవ్రస్థాయిలో బాడీ షేమింగ్ చేశారని ఉపాసన అన్నారు. కెరీర్ పీక్స్లో ఉన్న ఒక స్టార్ హీరోను పెళ్లాడిన తరుణంలో అలాంటి మాటలు విన్నప్పుడు మొదట్లో మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని అన్నారు. అయితే ఆ నెగెటివిటీనే తనను మరింత దృఢంగా మార్చిందని, బయటి వ్యక్తుల మాటల కంటే తన కుటుంబ సభ్యుల ఆలోచనలే ముఖ్యమని గ్రహించి మానసికంగా రాటుదేలినట్లు స్పష్టం చేశారు.
తను బరువు పెరగడానికి గల అసలు కారణాన్ని కూడా ఉపాసన వివరించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినప్పుడు కుటుంబానికి దూరమై తీవ్రమైన బెంగ, హోమ్సిక్ ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తెలియకుండానే ఎక్కువగా తినడం అలవాటుగా మారిందని, దీని ప్రభావంతో కేవలం 18 ఏళ్ల వయసులోనే ఏకంగా 95 కిలోల బరువుకు చేరుకున్నానని అన్నారు. ఆ తర్వాత బరువు తగ్గేందుకు డైటీషియన్ల చుట్టూ తిరిగినప్పటికీ, లైఫ్స్టైల్ మార్పులతోనే అద్భుత రిజల్ట్ వచ్చిందని పేర్కొన్నారు. అన్నం, గోధుమ పదార్థాలను పక్కనబెట్టి ఓట్స్, హై ప్రొటీన్ ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తూ రోజూ క్రమం తప్పకుండా 10 వేల అడుగులు వేసేదాన్నని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం చరణ్ కోసం, తన ఆరోగ్యం కోసం ఇద్దరం కలిసే వర్కవుట్లు చేస్తూ కొత్త డైట్లను అనుసరిస్తున్నామని తెలిపారు. తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ.. తాను, తన తల్లి ఇద్దరం తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. రోజుకు 4 గంటలకు మించి నిద్రపోలేకపోవడం వల్ల త్వరగా అలసట వస్తుందని, ఈ సమస్యపై విస్తృత అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రత్యేకంగా ఓ ‘స్లీప్ క్లినిక్’ను స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎన్ని మందులు వాడినా అంతిమంగా మన ఆలోచనా సరళిలోనే మార్పు రావాలని, దీపక్ చోప్రా క్లాసులు, సద్గురు ప్రవచనాలు తనకు మానసిక ప్రశాంతతను ఇస్తున్నాయని ఉపాసన పంచుకున్నారు. బాడీ షేమింగ్ చేసేవారికి తన ఫిట్నెస్, ఆత్మవిశ్వాసంతోనే సమాధానం చెప్పిన ఉపాసన ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

