తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత నేను కార్మికులతో నేరుగా మాట్లాడతాను. ఈ అంశాలన్నిటినీ దిల్ రాజుకు అప్పగించాము. ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్తో చర్చలు జరుపుతున్నారు,” అని వెల్లడించారు. ఆయన మరింత మాట్లాడుతూ, “పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాము. కాబట్టి, కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి, నిర్మాతలు తగిన నిర్ణయం తీసుకోవాలి,” అని స్పష్టం చేశారు.
