26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా జీ 5 ‘స్టేట్ ఆఫ్ సీజ్ : 26/11’ ను అందించింది. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్ ఆఫ్ సీజ్’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఇది శుక్రవారం నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ హిందీ నటుడు అక్షయ్ ఖన్నా చాలా సంవత్సరాల తర్వాత ఆర్మీ యూనిఫామ్లో కనిపిస్తుండటం విశేషం.
‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’లో ఎన్ఎస్జీ కమాండోగా నటించిన వివేక్ దహియాను ఈ ఒరిజినల్ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన మంజరి ఫడ్నవీస్, గౌతమ్ రోడె, సమీర్ సోని, పర్వీన్ దబాస్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’ రూపొందించిన కాంటిలో పిక్చర్స్ కి చెందిన అభిమన్యు సింగ్ ఈ చిత్రానికి నిర్మాత. ‘అభయ్ 2’కు దర్శకత్వం వహించిన కెన్ ఘోష్ దీనికి దర్శకుడు. 26/11 ముంబయి దాడుల సమయంలో ఎన్ఎస్జీకికి సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న కల్నల్ (రిటైర్డ్) సందీప్ సేన్ ఈ స్టేట్ ఆఫ్ సీజ్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తుండటం విశేషం.
