Producer Narsamma: సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ‘ప్రభాస్’ గారు మాకు మీరే దిక్కు: మహిళా రైతు నిర్మాత

  • ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్
  • ఇదే టైటిల్‌తో తెరకెక్కిన మరో సినిమా
  • తెరపైకి స్పిరిట్ టైటిల్ వివాదం
  • ఆదుకోవాలని మహిళా రైతు నిర్మాత విజ్ఞప్తి
Spirit Is Not One Movie

Spirit Is Not One Movie

Spirit Movie Title Dispute: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. ఇదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కడంతో.. టైటిల్ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే చిన్న చిత్రాన్ని నిర్మించిన మహిళా రైతు నిర్మాత నర్సమ్మ.. తమ సినిమా విడుదల ఆగిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, టీ-సిరీస్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తాము సినిమా తీసి సర్వం కోల్పోయామని, పెద్దమనసు చేసుకుని ప్రభాస్ గారు తమను ఆదుకోవాలని కోరారు.

నర్సమ్మ మాట్లాడుతూ.. ‘మా కుటుంబం ఎన్నో కష్టాలు పడి, ఆస్తులు అమ్ముకుని స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా మా కల మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరి శ్రమ, ఆశలు, పెట్టుబడుల సమాహారం. సినిమా విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో లీగల్ నోటీసులు రావడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాము. టీ-సిరీస్ సంస్థ నుంచి మాకు రెండు లీగల్ నోటీసులు వచ్చాయి. స్పిరిట్ పేరుతో మా సినిమా ప్రచారం, విడుదల చేపట్టవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే మా చిత్రం ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ పొందింది. స్పిరిట్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే మా సినిమా ప్రచారం జరిగింది’ అని చెప్పారు.

×
×
Ad

‘మమ్మల్ని ఒకసారి సంప్రదించి ఉంటే టైటిల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ముందస్తు చర్చలు లేకుండానే నోటీసులు పంపడం వల్ల సినిమా విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ఈ వివాదం కారణంగా మా కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సినిమా విడుదల కోసం తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. విడుదలకు డబ్బులు ఇస్తామని చెప్పినవారు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఊరిలో పరువు పోయింది. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. టైటిల్‌పై అభ్యంతరాలు ఉంటే పెద్దల సమక్షంలో చర్చించి సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. పరస్పర అవగాహనతో సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నా’ అని నిర్మాత నర్సమ్మ తెలిపారు.

ప్రభాస్‌పై అభిమానంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని నర్సమ్మ స్పష్టం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే సినిమా టైటిల్ మార్చుకోవడానికి కూడా సిద్ధమేనని వెల్లడించారు. తమ చిత్రం విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని టీ-సిరీస్ నుంచి అధికారిక లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. సమస్యకు పరిష్కారం లభించకపోతే చివరగా తమ హక్కులను కాపాడుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నిర్మాత నర్సమ్మ చెప్పుకొచ్చారు.