తెలంగాణ మట్టి వాసనతో, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న నూతన చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిర్మల, సాయి కీర్తన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం సికింద్రాబాద్లోని గణేష్ దేవాలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ ముహూర్తపు షాట్కు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ లారా స్వయంగా మొదటి సీన్కు దర్శకత్వం వహించారు.
ప్రముఖ దర్శకుడు ప్రేమ్ రాజ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. దర్శకుడు లారా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1985వ సంవత్సరంలో జరిగిన నీటి సమస్యలు, కుల వివక్ష వంటి సున్నితమైన అంశాలను ప్రధాన కథాగా తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల కష్టాలను, సామాజిక రుగ్మతలను కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో పలువురు సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిధి తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులను ఖరారు చేసి.. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బైరాగి, రవి, చార్వాక, మేనేజర్ మధు తదితరులు పాల్గొన్నారు.