Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు

Saif Ali Khan Attack Case 300kb

Saif Ali Khan Attack Case 300kb

Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడంతో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. 2025 జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఓ వ్యక్తి ఆయన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఇంట్లోని ఓ భాగం నుంచి లోపలికి ప్రవేశించిన దుండగుడు సైఫ్ కుమారుడి గదికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో సైఫ్ అతడిని ఎదుర్కొన్న సమయంలో నిందితుడు కత్తితో దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి తర్వాత సైఫ్‌ను వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో కత్తి విరిగిన భాగం ఆయన శరీరంలో ఉండిపోయిందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స అనంతరం సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ కేసులో మహమ్మద్ షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను కస్టడీలో ఉన్నాడు.

ఇప్పుడు నేరాన్ని అంగీకరిస్తున్నందున శిక్షా కాలంలో కొంత క్షమాభిక్ష ప్రసాదించాలని 2026 ఆగస్టు 28న జరిగిన కోర్టు విచారణలో న్యాయస్థానాన్ని కోరారు. ఈ నెల ప్రారంభంలోనే అదనపు సెషన్స్ జడ్జి నిందితుడిపై ఫారినర్స్ యాక్ట్ కింద ప్రాణాంతక ఆయుధంతో దోపిడీ, తీవ్ర గాయాలు చేయడం వంటి కఠినమైన సెక్షన్లను ఫ్రేమ్ చేశారు. దీని ప్రకారం అతనికి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. నిందితుడి నేర అంగీకార పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ప్రాసిక్యూషన్‌ను ఆదేశించిన కోర్టు, ఈ కేసు తదుపరి విచారణను 2026 సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. ఇప్పుడు నిందితుడే తన నేరాన్ని అంగీకరించేందుకు ముందుకు రావడంతో అతని అభ్యర్థనను కోర్టు ఎలా పరిగణిస్తుంది? ప్రాసిక్యూషన్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 11న కోర్టులో జరిగే వాదనలపైనే ఉంది.