Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!

Razesh

Razesh

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా ఫీవర్, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్ల ట్రెండ్ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్న అచ్చమైన తెలుగు కామెడీ చిత్రం ‘రంభా ఊర్వశి మేనక’. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండా చేసిన సెన్సేషనల్ కామెంట్స్, సినిమాపై ఆయనకున్న అపారమైన నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం వస్తున్న రకరకాల యాక్షన్ సినిమాల మధ్య ఒక స్వచ్ఛమైన కామెడీ సినిమా తీయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్ట్ చేసినట్లు రాజేష్ దండా కుండబద్దలు కొట్టారు. “ఒకప్పుడు జంధ్యాల గారు, ఈవీవీ సత్యనారాయణ గారు, అలాగే ఇప్పుడు శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు తీసిన సినిమాల్లాగా.. రెండున్నరగంటల పాటు ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించే బాధ్యత నాది, దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నా” అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. థియేటర్‌కు వచ్చిన నమ్మకంతో ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూనే బయటకు వెళ్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసినప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లతో పాటు తాను కూడా తీవ్ర టెన్షన్‌కు గురయ్యానని, గత నాలుగైదు రోజులుగా సరిగ్గా నిద్ర కూడా పోలేదని ఆయన పంచుకున్నారు. దేవుడి దయవల్ల ఫైనల్‌గా సెప్టెంబర్ 4నే సినిమా థియేటర్లలోకి వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతగా ఇది తన ఎనిమిదో సినిమా అని, తాను కేవలం సినిమాను మాత్రమే నిర్మించగలనని, దానికి అసలైన జీవితాన్ని ఇచ్చేది మాత్రం ప్రేక్షకులే అని చెప్పుకొచ్చారు.

ఈ ఈవెంట్ లో ఎవరి గురించీ తాను ఇప్పుడు మాట్లాడనని, శుక్రవారం జరగబోయే సక్సెస్ మీట్‌లోనే అందరి గురించి మాట్లాడతానని రాజేష్ దండా చెప్పడం సినిమా రిజల్ట్ పై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులే బ్రాండ్ అంబాసిడర్లు అని, థియేటర్లో సినిమా చూసి నవ్వుకున్న ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి చెప్పి ‘మౌత్ టాక్’ ద్వారా సినిమాను భారీ హిట్ చేయాలని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.