Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. తన తదుపరి సినిమాకు ‘పోలీస్ కంపెనీ’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. “ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ” అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించడం ఆసక్తిని పెంచుతోంది.ముంబై అండర్వరల్డ్, పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు లభిస్తే.. అది క్రమంగా ఒక సంస్థ నుంచి ‘కంపెనీ’గా మారే పరిస్థితి ఎలా ఏర్పడుతుందనే కోణంలో కథను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం ప్రత్యర్థి గ్యాంగ్లను అంతం చేసిన తర్వాత తన గ్యాంగ్ను ‘డీ కంపెనీ’గా మార్చడం, అనంతరం దుబాయ్ వెళ్లడం, ఛోటా రాజన్ కార్యకలాపాలను నిర్వహించడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం వంటి పరిణామాలను ఈ కథకు నేపథ్యంగా తీసుకున్నట్లు వర్మ వెల్లడించారు. వారి మధ్య విభేదాల అనంతరం ముంబై అండర్వరల్డ్లో ఏర్పడిన ఖాళీని ఇతర గ్యాంగ్లు భర్తీ చేయడంతో నేర కార్యకలాపాలు పెరిగిన పరిస్థితులను కూడా సినిమాలో చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అండర్వరల్డ్ను అడ్డుకునేందుకు 1997 నుంచి 2004 మధ్య ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు వర్మ తెలిపారు. ఆ స్క్వాడ్ వందలాది గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టిన ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ‘పోలీస్ కంపెనీ’ కథను తెరకెక్కించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక స్క్వాడ్లో సభ్యుడైన పోలీస్ అధికారి దయా నాయక్ పాత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ పాత్రలో నటుడు హర్షవర్ధన్ రాణే కనిపించనున్నారని తెలిపారు. సినిమాకు భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అండర్వరల్డ్ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే రామ్ గోపాల్ వర్మ.. ఈసారి పోలీస్ స్క్వాడ్ నేపథ్యంలో ఎలాంటి కథను చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. T-Series నిర్మాణంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

