గత ఏడాది రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ నేతృత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. సెట్లో తాజాగా జరిగిన ప్రమాదం చిత్ర యూనిట్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం.. చెన్నై సమీపంలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో ‘జైలర్ 2’ సినిమా కోసం ఆర్ట్ డైరెక్షన్ బృందం ఒక ఇల్లు లాంటి భారీ సెట్ను నిర్మిస్తోంది. ఈ పనుల్లో నిమగ్నమైన 28 ఏళ్ల కార్తికేయన్ అనే యువ కార్మికుడికి,
అక్కడ అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపోవడంతో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే కార్తికేయన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కనత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి భద్రతా లోపాలపై దర్యాప్తు ప్రారంభించారు. చెప్పాలంటే ఈ మూవీ ప్రారంభం నుండి చిత్ర యూనిట్కు వరుసగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలు.. ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అవి వైరల్ కావడంతో నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ లీకేజీలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆ లీకుల వివాదం నుండి కోలుకోకముందే, ఇప్పుడు సెట్లో ప్రాణాంతక ప్రమాదం జరగడంతో షూటింగ్కు తాత్కాలికంగా విరామం పడే అవకాశం కనిపిస్తోంది. . కోట్ల బడ్జెట్తో నిర్మించే ఇలాంటి భారీ చిత్రాల సెట్స్లో కార్మికుల ప్రాణాల రక్షణకు మరింత పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కార్తికేయన్ మృతిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
