Payal Rajput: వెలుగుల ప్రపంచమైన సినీ లోకంలో తారల వెనుక కూడా ఎన్నో గుండె కోతలు, చెప్పలేని బాధలు ఉంటాయని నటి పాయల్ రాజ్పుత్ మాటలు మరోసారి నిరూపించాయి. ఇటీవల జరిగిన తన లవర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాయల్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ దృశ్యాలు చూసిన వారందరినీ కంటతడి పెట్టించాయి.
పాయల్ రాజ్పుత్ తెలుగులో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే, తన విజయాల్లో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని పాయల్ గుర్తుచేసుకున్నారు. ఆయన తనకు ఒక తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక ‘హీరో’గా ఎల్లప్పుడూ అండగా నిలిచారని ఆమె చెప్పారు.తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని పాయల్ కన్నీటితో వెల్లడించారు. ఆ సమయంలో తన కుటుంబం ఎంతటి మానసిక వేదనను అనుభవించిందో వివరిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన తల్లి ఆ క్లిష్ట పరిస్థితుల్లో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారని, ఆ సమయంలో తనను తాను ఎలా ఓదార్చుకోవాలో కూడా అర్థం కాలేదని పాయల్ చెప్పారు. తండ్రిని కోల్పోయి ఏడాది కావస్తున్నా, ఆయన లేని లోటు తనను నిరంతరం వెంటాడుతోందని పాయల్ పేర్కొన్నారు. జీవితంలో ఎదురైన ఈ అతిపెద్ద విపత్తు నుండి కోలుకోవడానికి తాను జైపూర్లో ‘విపాసన’ ధ్యానం చేసినట్లు పాయల్ తెలిపారు. తన తండ్రి మరణం కలిగించిన ఆవేదన, మానసిక ఒత్తిడి నుండి బయటపడేందుకు ఈ ప్రక్రియ తనకు కొంతవరకు సహాయపడిందని ఆమె చెప్పారు.
