బాలీవుడ్ సీనియర నిర్మాత, దర్శకుడు పహ్లజ్ నిహ్లాని కొంత కాలం క్రితం అనారోగ్యం పాలయ్యారు. తీవ్రంగా అస్వస్థతకి గురైన ఆయన 28 రోజులు పాటూ హాస్పిటల్ మంచంపై ఉన్నారు. చావుని అతి దగ్గరగా చూసొచ్చాని ఆయన చెబుతున్నారు. అసలు తాను అనారోగ్యం పాలైనట్టు పరిశ్రమలో ఎవరికీ తెలియదని పహ్లజ్ చెప్పారు. ఎందుకంటే, ఇండస్ట్రీ ఎవరు బ్రితికినా, చనిపోయినా పట్టించుకోదని నిర్వేదంగా మాట్లాడారు. అంతే కాదు, కరోనా కల్లోలం నడుమ మనిషి మరణం మరింత సాధారణమైపోయిందని వాపోయారు.
పహ్లజ్ నిహ్లాని నిజానికి కరోనా వైరస్ సోకటం వల్ల ఆసుపత్రి పాలు కాలేదు. ఆయనకి గత ఏడాడే కోవిడ్ వచ్చి, తగ్గింది కూడా. కానీ, ఈసారి ఆయన కొందరు మిత్రులతో కలసి బయట నుంచీ వచ్చిన ఆహారం తినాల్సి వచ్చిందట. అదే ప్రాణాపాయ స్థితిని తెచ్చిపెట్టిందట. పహ్లజ్ ఆసుపత్రిలో చేరే ముందు రోజు అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేశారు. స్నేహితులతో కలసి చికెన్ తిన్నారు. తరువాత కొన్ని గంటల్లోనే తిన్నదంతా వాంతి రూపంలో బయటకు వచ్చేసింది. కానీ, ఆ తరువాత కూడా ఆయనకి రక్తంతో కూడిన వాంతులు అవుతూనే ఉండటంతో కుటుంబ సంభ్యులు హాస్పిటల్ కి తరలించారు.
ముంబైలోని నానావతి హాస్పిటల్లో 28 రోజులు ప్రాణ గండంతో పోరాడిన ఆయన ఎట్టకేలకు క్షేమంగా తిరిగి వచ్చారు. అయితే, పహ్లజ్ తన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది వల్లే తాను బ్రతికానని అన్నారు. వాళ్లు సరైన విధంగా స్పందించి, కాపాడి ఉండకపోతే చనిపోయేవాడినని తెలిపారు. తనకు, తన మిత్రులకి ఆ రోజు రాత్రి విషపూరితమైన మాంసాన్ని సరఫరా చేసి, అనారోగ్యానికి కారణమైన… సదరు కంపెనీపై చట్ట పరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటానని నిహ్లాని అంటున్నారు…