యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. యంగ్ టైగర్ను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు.
ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్ కట్ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు అల్లరి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు.