మన సమాజంలో ఎంత టెక్నాలజీ పెరిగినా ఇంకా కొన్ని రకాల అపోహలు, మూఢనమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సామాజికాంశాన్నే బేస్ చేసుకుని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఆలోచింపజేసేందుకు ఓ విభిన్నమైన చిత్రం మన ముందుకు రాబోతోంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా.. సీనియర్ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త మూవీ ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’. బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్పై, గతంలో ‘Eట్లు’ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన రోశిరెడ్డి పందిళ్లపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లోని అమీర్పేట సారథి స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టగా, లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్కు టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ “సమాజంలో వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్లాన్ చేశాం. ముఖ్యంగా మన నిత్యజీవితంలో ‘నిమ్మకాయ’ చుట్టూ ఉండే రకరకాల భయాలు, అపోహలను ఈ కథలో వినోదాత్మకంగా చూపిస్తూనే, లాజిక్తో ఆలోచింపజేస్తాం. ఈ స్క్రిప్ట్ ఎక్కువ భాగం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే రెడీ అయింది.” అని తెలిపారు. యాక్టర్ సుమన్ మాట్లాడుతూ, కథలోని హారర్, థ్రిల్లర్ అంశాలు తనకు బాగా నచ్చాయని, ఆమనితో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే, చిత్ర పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి కల్పించే చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, కలియుగ వెంకటేశ్వర స్వామిగా మెప్పించిన సుమన్ ఈ సినిమాలో ఉండటం చిత్రానికి ప్లస్ అవుతుందన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళభరణి, రవిబాబు, టార్జాన్, బెంగళూరు అవినాష్, గడ్డం నవీన్, సుమన్ శెట్టి, జబర్దస్త్ రాజమౌళి వంటి పెద్ద నటీనటుల బలగం కనిపిస్తోంది. ఇప్పటికే టైటిల్తోనే సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచేసిన ఈ చిత్రం.. వచ్చే ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ను జరుపుకోనుంది.

