నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ క్రేజీ పొలిటికల్ డ్రామా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో గల ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ముహూర్తపు వేడుక నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పూజా కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకులు గోపీచంద్ మలినేని ముఖ్య అతిథిధులుగా హాజరయ్యారు. ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ ఊరమాస్ ఇమేజ్కు, సామాజిక సందేశాలను కమర్షియల్ ఎలిమెంట్స్తో పవర్ఫుల్గా చూపించే కొరటాల శివ మార్క్ టేకింగ్ తోడవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘సింహా’ సినిమాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. ఆ సినిమాలో బాలయ్య డైలాగ్స్, క్యారెక్టరైజేషన్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ దర్శకుడు-నటుడిగా చేతులు కలపడం అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ‘పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఎ మూవ్మెంట్’ అనే పవర్ఫుల్ ట్యాగ్లైన్తో రాబోతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

