ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలియగానే ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మరియు వదిన సురేఖ తక్షణమే సింగపూర్కి బయల్దేరారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు మరియు మద్దతు అందించేందుకు సింగపూర్ కు పయనమయ్యారు. మార్క్ శంకర్కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. అలాగే మార్క్ శంకర్ తండ్రి పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరారు.